Konaseema News: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను గడువులోపే నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని రైతులను దశాబ్దాలుగా వేధిస్తున్న ఉప్పునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, రూ.20.77 కోట్లతో శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళవారం ఆయన శ్రీకారం చుట్టారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్గా ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
45 రోజుల గడువు.. 35 రోజుల్లోనే పరిష్కారం
గత నెలలో రాజోలు పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్, ఉప్పునీరు పొలాల్లోకి చేరడం వల్ల వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోవడం చూసి చలించిపోయారు. ఆ సమయంలో రైతులకు 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కేవలం 35 రోజుల్లోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం విశేషం.
పనుల వివరాలు:
-
డ్రెడ్జింగ్: డ్రెయిన్లోని 8.50 కి.మీ నుండి 16.50 కి.మీ వరకు పూడికతీత పనులు చేపడతారు.
-
గట్ల బలోపేతం: రెండు వైపులా 14.50 కి.మీ వరకు గట్లను పటిష్టం చేస్తారు.
-
ఆక్రమణల తొలగింపు: సుమారు 250 ఎకరాల డ్రెయిన్ స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్కు సూచించారు.
Konaseema News: రైతుల కంట కన్నీరు రానివ్వం
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టని రాష్ట్రమే బాగుపడుతుంది. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, అవి మోడువారుతుంటే చూడలేకపోయాను. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది” అని విమర్శించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డ్రెయిన్ల వ్యవస్థ ప్రక్షాళన కోసం బి.సి. రోశయ్య నివేదిక ప్రకారం రూ.4 వేల కోట్లు అవసరమని, దీనిపై దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
కొబ్బరి రైతుల కోసం మరిన్ని చర్యలు
-
కోకోనట్ బోర్డు: కోనసీమలో ప్రత్యేకంగా కోకోనట్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
-
కౌలు రైతులకు అండ: గతంలో తన సొంత నిధులతో కౌలు రైతులకు ఎలా అండగా నిలిచానో, ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
